Thursday, January 30, 2014

ఆవేదన


         కాయ పండకుండానే
         నేలరాలింది
         ఓ కన్నీటి చుక్క
          రాలింది.
        వికసించకుండానే మొగ్గ
          నలిగింది
       ఓ తల్లి హృదయం
       తల్లడిల్లింది.
       ఎదగకుండానే బాల్యం
       బధ్ధలైంది
       కన్నవారి గుండెలు
      కడలిగా మారాయి.
      అభాగిని అందం
      కాలిపోయింది
     అమ్మయి అంతరంగం
    ఆక్రోశించింది.
   ఈ అకృత్యాలనుగని భరతమాత
     కన్నీరైంది.

Saturday, January 25, 2014

మంచి మాట


     ఒకటి గొని,రెంటి నిశ్చల యుక్తి జేర్చి,
     మూటి నాల్గింట గడు వశ్యములుగ జేసి,
     యేనిటిని గెల్చి, యారిటి నెఱిగి,యేడు
     విడిచి వర్తించు వాడు వివేకధనుడు.
           భగవంతునిపై నిశ్చలమైన మనస్సును ,భక్తిని నిలిపి త్రికరణ శుధ్ధిగా  చతుర్విధ పురుషార్ధాలను వశము చేసుకొని,పంచేంద్రియములను గెలిచి అరిషడ్వర్గములను తెలిసికొని, సప్తవ్యసనములకు దూరంగా నడచు వాడే వివేకవంతుడు .----అని విదురుడు మహాభారతం లో ధృతరాష్ట్రునికి  చెప్పాడు.కాని ఇది సర్వకాల సర్వావస్థలలోను ఆచరిచ దగినది.
  అరిషడ్వర్గాలు---కామ,క్రోధ,లోభ,మోహ,మద,మాత్సర్యములు.
  సప్తవ్యసనములు---జూదము,మాంసము,మద్యము,వ్యభిచారము,వేట,దొంగతనము,పరస్త్రీ వ్యామోహము.

Thursday, January 23, 2014

యోగ-ఒక ఆలోచన


     ఈ రోజుల్లో చాలామంది మేము యోగా నేర్చు కుంటున్నామనో,యోగాకి వెళితే మంచిదనో చెప్తూ వుంటారు. అసలు యోగా అంటే ఏమిటో కొన్ని విషయాలు తెలుసుకుందాము.
         యోగా అంటే మనస్సు లేని స్థితి అంటారు పతంజలి.మనోవ్యాపారాలను ఆపివేయడం.మనస్సులో అహంకారం, కోర్కెలు,ఆశలు, తాత్త్విక చింతనలు అన్నీ మామూలుగా వుంటాయి.మనస్సు లేకపోతే ఇవేమీ తెలియని స్థితిలోకి ప్రవేశిస్తాము.యోగా అనేది తెలియని స్థితి లోకి వెళ్ళడం. దీనినే రామచంద్రజీ మనస్సుకి వైరాగ్యాన్ని అలవర్చుకోవాలని చెబుతారు. యోగా అనేది ఒక శాస్త్రం మతం కాదు.మతం నమ్మకాన్ని గురించి చెబుతుంది.యోగా అనుభవాన్ని తెలియజేస్తుంది. మనిషి రేపటి గురించి ,భవిష్యత్తు గురించి ఆశ భ్రమలలో బ్రతుకుతున్నాడు.నగ్నమైన సత్యాన్ని చూసేందుకు ఎవరు సిధ్ధంగాలేరు.ఇలాంటి మనస్సు ఎప్పుడూ యోగా మార్గం లో ప్రవేశించ లేదు.ఎప్పుడైతే ఆశా భ్రమా లేకుండా జీవితం అర్ధ రహితంగా భావిస్తామొ అప్పుడు మాత్ర్మే యోగ శాస్త్రాన్ని అర్ధం చేసుకోగలం.బుధ్ధితోయోగాన్ని అర్ధం చేసుకోగలం వుపన్యాసం ఇవ్వగలం,వ్యాసాలు వ్రాయగలం కానీ యోగి కాలేము. యోగిగా మారాలంటే శిక్షణ అవసరం. శిక్షణ అంటే మనల్ని మనం క్రమ బధ్ధీకరించుకోవడం. మనం మనం గాఉండగలగడం. మనల్ని మనం తెలుసుకో గలగడం. ఆశ పూర్తిగానశించాలి.మనస్సు చెప్పేదంతా నిరర్ధకమన్న ఙానం కలగాలి.మనస్సును ఎప్పుడైతే వదిలేయగలమో అప్పుడు యోగాలోకి ప్రవేశించగలం. భవిష్యత్తు వైపు కానీ భూతకాలం వైపు కానీ వెళ్ళడం మానేసి  వర్తమానం లో ప్రయాణిచడం మొదలు పెట్టాలి.
                   మనస్సును అదుపు వుంచాలంటే దాని రూపాంతరాలను ముందు తెలుసుకోవాలి.మనస్సు యొక్క మొదటి రూపం ప్రమాణం.అదే వాస్తవిక ఙానం.మనకు సరైన ఙానం లభించి నప్పుడు దానిని నిరూపించు కోవాల్సిన అవసరం లేదు మార్గం ఎంచుకోవాల్సిన పనిలేదు.ఎందుకంటే అది వాస్తవం కాబట్టి.
             రెండవది విపర్యయ లేదా తప్పడు ~ంఆనం.ఏ పనిచేసినా తప్పుగానే చేస్తాము.ఏం చదివినా,ఎలా ప్రవర్తించినా అది తప్పుగానే ఉంటుంది.దెవుని దయను ఉన్మాదంగా అర్ధం చేసుకున్న ఒమర్ ఖయ్యాం  జీవితాంతం తాగుతూనే ఉన్నాడు.ఎందుకంటే దేవుడు దయ గలవాడు కనుక తనపట్ల దయ చూపిస్తాడని భావిస్తాడు. ఇది తప్పుడు ఙానం.
               మూడవది కల్పన. అందమైనవి అసహ్యకరమైనవి కూడా ఆ కల్పన నుండి వచ్చినవే.అందమైన ప్రపంచాన్ని సృష్టించాలంటే బలహీనుల్ని,అందవిహీనుల్ని ,అంగవికలుర్ని నాశనం చేయడం ద్వారా చేయవచ్చు అనేది కల్పన.అసలు నాశనం చేయడం అనేదే వికృతమైన ఆలోచన. ఇది అధివాస్తవిక కల్పన. కల్పన కవిత్వాన్ని, కళలను,చిత్రాలను ఎలా ఇవ్వగలదో అలాగే ఉన్మాదాన్ని కూడా. మనమెలావినియోగిస్తామనే దాన్ని బట్టి ఉంటుంది.
                   నాలుగు నిద్ర .నిద్ర అనేది స్పృహలో లేకపోవడం. చైతన్యం తనలో తను ముకుళించుకు పోతుంది.మనస్సు పనిచేయదు. కల కంటున్నామంటే నిద్ర పోవడం లేదన్న మాట.నిద్రకు మెలుకువకు మధ్యలో ఉన్నామన్న మాట.నిద్ర జీవ శక్తిని ఇస్తుంది. నిద్రను ఎలా వాడు కోవాలో తెలిస్తే అది సమాధి అవుతుంది.బుధుడు ,రామకృష్ణుడు ఏ ఆనందాన్ని అనుభవించారో ఆ ఆనందం మన సొంతమౌ తుంది.నిద్రలో కూడాప్రమత్తంగా ఉంటే అది సమాధి అవుతుంది.అది అధ్యాత్మిక అనుభూతి.
                ఙాపకం అయిదవ రూపాంతరం. ఙ్పకాన్ని తప్పుగా వాడుకుంటే అది గందరగోళాన్ని సృష్టిస్తుంది. దానిలో కల్పన ప్రవేశించ వచ్చు.మార్పులకు గురికావచ్చు.ఙాపకం సరీయినదిగా ఉండాలంటే మనిషి తన పట్ల తాను నిజాయితీగా ఉండాలి. అది గత జీవితాన్నుండి విముక్తులను చేస్తుంది.అంతహ్ చేతనలో ఏదైతే ఉందో దానిని అలాగే ఉండనిస్తే అలాగేవాస్తవాన్ని చూడగలిగితే అదే స్వేచ్చ,స్వాతంత్ర్యం.అంటాడు పతంజలి.అప్పుడు మనస్సులో స్పష్టత సాధ్యమౌ తుంది.అదే ధ్యానం వైపు నడిపిస్తుంది.
                   ఎప్పుడైతే మనస్సు రూపాంతరాలను గ్రహించి దాని ప్రవాహవేగాన్ని అధిగమిస్తామో అప్పుడు మనస్సులేని స్థితిని పొందగలం.మనిషిలక్ష్యం సత్యం. అదిచేరుకోవడానికి అనేక మార్గాలున్నాయి.పతంజలి అన్ని మార్గాలను వివరిస్తాడు.రామచంద్రజీ క్షాళన,ప్రార్ధనలను ప్రముఖం గా వివరిస్తారు. క్షాళన ప్రక్రియ ఆలోచన యొక్క మూలశక్తిని మానవ సంకల్ప రూపం లోవ్యక్తి యొక్క ఆత్మను శుధి చేయడానికి ఉపయోగిస్తుంది.ప్రార్ధన విజయం సాధించడానికితిరుగులేని ఉపయోగంగా పేర్కొనబడింది.భగవంతుని సతత స్మరణ చేస్తూ ఆత్మార్పణ కావించాలని ఆయన చెబుతారు ఇంకా హృదయం వధ్ధ దివ్యజ్యొతి వున్నదని భావించి హృదయ ధ్యాన పధ్ధతి ద్వారా పవిత్ర దివ్యత్వంతో ఏర్పరుచుకోవాలంటారు రామచంద్రజీ.
              ఎవరు ఏ మార్గాన్ని చెప్పినప్పటికీ అంతిమంగా మనం చిత్తశుధ్ధితో ప్రయత్నించినప్పుడే లక్ష్యాన్ని చేరుకోగలం.ఏదో సాధించాలన్న ఉధ్ధేశ్యముతోనో తాత్కాలిక ప్రయోజనం ఆశించో చేయడ వలన ప్రయోజనం ఉండదు. ధ్యానం చేయండి.ఆనందించండి అక్కడ లక్ష్యం లేదు. భవిష్యత్తు లేదు.ధ్యానం చేయండి సంతోషించండి.అకస్మాత్తుగా లక్ష్యం అక్కడ ఉంటుంది.ప్రయత్నిచండి మరి.