Sunday, July 21, 2013

తెలుగు గీతం


 తెలుగు పాట తేనెమాటల ఊట
కుహూకుహూ రాగాల కోకిలపాట
పంచదారకన్న ఇక్షురసం కన్న
లేజవరాలి మోవికన్న తియ్యనైన తెలుగు
అజంతమై అమృతభావననింపు
నవరసాలొలుకు పద సంపద
అనుభూతులు అనుభవాలు పలుకు అక్షర దీప్తి
నీ సంపదే ను తెలుగు భాషామ తల్లి
పలుకుసమాసములు పదబంధమ్ములు
సూక్తులు నానుడులు సామెతలు జాతీయమ్ములు
తెలుగు వాడి నోట పలికినవి నిత్య చైతన్య స్రవంతిగా
అవధానాల అవధి చందో చమత్కృతి నెరిగిన భాష
శతకాల సంకీర్తనల చాటువులతో
ఇంపున పెంపై సోయగమొలుకు భాష
నానారుచిరార్ధ  సూక్తినిధి నన్నయ్య
అల్పాక్షరాల అనల్పార్ధ శిల్పి తిక్కన్న
ఎఱ్ఱన పెధన పోతనాది సేవలందిన భాష
జానపదుల వాఙ్మయ విన్యాసాలు
క్షేత్రయ అన్నమయల పదకవితా పరిమళాలు
సూరన కల్పనా చాతుర్యాలు
హాస్య రచనల వెన్నెల వయ్యారాలు
నాట్యమాడినవిట రసికలోక భాగ్యముగా
కధా నవలా నాటకాది ఆభరణాలనెన్నో
ఇమ్ముగా అలంకరించుకున్న ఇష్ట సఖి తెలుగు
మాండలిక యాస భాషలెన్నో ఇముడ్చుకున్నా
ప్రతి గుండెలో పలుకు సమైక్యతారాగం .

Tuesday, June 11, 2013

మంచి మాట


 "విజయం సాధించడానికి ఒక శాతం తెలివితేటలు చాలు. మిగతా 99శాతం కష్టపడాలి"--
  కృషికి పట్టుదల తోడైతే విజయం మన సొంతం అవుతుంది.
గాలిలోదీపం  ను మన ప్రయత్నం లేనిదే ఏ రాముడూ రక్షించడు.

Monday, June 10, 2013

మంచి మాట


 "వాడని ఇనుము తుప్పు పడుతుంది.కదలని నీరు స్వచ్చత కోల్పోతుంది. బద్దకం మెదడుని నిస్తేజం చేస్తుంది."----
అందుకే సోమరితనము కన్న హీనగుణము కలదె--అంటాడు సుమతీ శతక కారుడు.

Friday, May 24, 2013

chalam jayanti

స్త్రీకి శరీరం ఉంటుంది దానికి వ్యాయామం ఇవ్వాలి
 స్త్రీకి మెదడు ఉన్నది దానికి ఙానం ఇవ్వాలి
 స్త్రీకి హృదయం ఉంటుంది దానికి అనుభవం ఇవ్వాలి"--అని తొలిసారిగా ప్రకటించి స్త్రీకి ఒక అస్తిత్వాన్ని ఇచ్చిన చలం జయంతి రేపు.
             చలం మే 18 ,1894 బుధ జయంతి రోజున మద్రాసులో జన్మించాడు. తల్లి వెంకట సుబ్బమ్మ, తండ్రి కొమ్మూరి సాంబశివ రావు. చిన్నప్పుడే తాత (తల్లి తండ్రి )దత్తత తీసుకోవడంతో గుడిపాటి వెంకటా చలం అయ్యారు.పిఠాపురం కళాశాలలో చదివాడు. చిన్నతనం లోనే పురాణాలను ఆకళింపు చేసుకున్నాడు. తల్లి చెల్లెలు పడుతున్న ఇబ్బందులను గమనించి స్త్రీల సమస్య ల పట్ల ఆకర్షితుడు అయ్యాడు.సమాజం నుండి,అయినవాళ్ళ నుండి ,చుట్టుపక్కల వారినుండి స్త్రీలు భౌతికంగా మానసికంగా ఎదుర్కొంటున్న సమస్యలు ఆయన్ను కదిలించాయి,ఆలోచింపజేశాయి.అందువల్లనేస్త్రీని ప్రధానాంశముగా చేసుకొని రచనలు చేసాడు.
               మైదానం,శశిరేఖ, దైవమిచ్చినభార్య,బ్రాహ్మణీకం, అరుణ అనసూయ,జలసీ మొదలగు రచనలు ఆయనకు పేరు ప్రఖ్యాతులను తెచ్చిపెట్టాయి అంతే వివాదాస్పదమూఅయ్యాయి. మైదానం లో రాజేశ్వరి భర్తను వదిలి ఒకముస్లిం కుర్రాడితో వెళ్ళిపోతుంది. ఇక శశిరేఖ ప్రేమను ,సౌందర్యాన్ని  వెతుక్కుంటూ తిరుగుతూనే ఉంటుంది.ఈ విశృంఖలత్వాన్ని సహజంగానే నిరసిస్తారు.కాని మనం ఇక్కడచుడవలసింది  స్త్రీ ఆలోచనలకు,వ్యక్తిత్వానికి ప్రాధాన్యత ఇవ్వకపోతేను ఆమెను కనీసం ఒకమనిషిగా కూడా చూడకపోతే  జరిగే అనర్ధాన్ని చెప్పివుండవచ్చు. వివాహ వ్యవస్తలోని లోపాలను,కుళ్ళును, అర్ధహీనతను,ప్రేమరాహిత్యాన్ని,బలవంతాన్ని,మెటీరయలిష్టు  పోకడలు ఈ నవలలో కనిపిస్తాయి.
           గృహ హింసను చిత్రించే కథ జలసీ.ఎంతో నాగరికత,దయ,గౌరవమూ కలిగినపెద్ద మనుషులు భార్యల దగ్గరకు వచేటప్పటికి ఎలా ప్రవర్తిస్తారో చలపతిరావుని చూస్తే తెలుస్తుంది.కోరి ఆదర్సం కోసం వితంతువుని వివాహం చేసుకొని తర్వాత అస్తమానం అనుమానం తో ఎలా వేపుకుతింటాడో ,భార్యల మీద భర్తలమనే అధికారం తో మగాళ్ళు సాగించే దౌర్జన్యానికి తార్కాణం ఈ కధ .సుశీల కధ లో భర్త మీద ప్రేమను,సులేమాన్ పై ప్రేమను వదులుకోలేక మానసిక సంఘర్షణకు లోనై చివరకు క్షయ రోగ పీడితుడైన భర్తకు సేవ చేస్తూ వుండి పోతుంది .తన కధలలో మధ్య తరగతి భేషజాన్ని,కపటత్వానీ తీవ్రంగా దుయ్యబడతాడు అనేక వ్యాసాలుకూడా వ్రాసాడు.చలం ముందుచూపు పదేళ్ళకో, పాతికేళ్ళకో కాక శతాబ్దాల ముందుకి విస్తరించినది.
                 ఎంతోచదువుకొని వున్నత పదవులలో వున్న స్త్రీలు కూడా  తమ సొంత అభిప్రాయాలను స్వేచ్చగా చెప్పగలిగే స్థాయిలో ఎంతమంది వుంటారు?వేళ్ళపై లెక్క పెట్టవచ్చు.భర్తను దాటి సొంత నిర్ణయాలు తీసుకునేపరిస్థితి ఈనాటికీ  లేదు. అలా  తీసుకున్నా తీవ్రమైన సంఘర్షణను ఎదుర్కోవలసి వస్తుంది.
              ఏది ఏమైనా స్త్రీల కోసం ఇంతగా వేదన అనుభవించిన  రచయిత మరొకరు లేరనే చెప్పవచ్చు.రేపు 25వతేదీ భుధ్ధ పూర్ణిమ ఆయన జయంతి. ఈ సందర్భంగా చలం ను స్మరించుకోవడం  తెలుగు వారిగా మనకర్తవ్యం.
           

Friday, May 17, 2013

గమ్యం


గమ్యం చేరగానే ప్రయాణం ఆగిపోవాలా?
చదువు గమ్యం ఉద్యోగమేన
స్త్రీ జీవితం వివాహం తో ఆగిపోతుందా
ఉదయం అవగానే సూర్యుని ప్రయాణం ఆగుతోందా
చంద్రుడు  అమావాస్యలోనే మిగిలిపోతున్నాడా
వీచే సమీరం తన వునికిని కోల్పోతోందా
అలలు తీరం చేరాలని నిరంతరంప్రయత్నం చేయటంలేదా
కాలం పరుగుల ప్రయాణం చేయటం లేదా
కానీ
మనిషెందుకు తను అనుకొన్న గమ్యం చేరగానే
నడకనే ఆపేస్తాడు.
అక్కడితో జీవితమే అయిపోయిందని భావిస్తాడు.

Wednesday, May 15, 2013

 కంఠాభరణం -ఒక సమీక్ష
 ఈ మధ్య పుస్తకాలు సర్ధుతుంటే పానుగంటి లక్ష్మీ నరసిం హా రావు గారి "కంఠాభరణం" కంటబడినది.మళ్ళా ఒకసారి తిరగ  వేద్దాములే అని చదివాను.బ్లాగు మిత్రులకు కూడా పరిచయం చేద్దామని వ్రాస్తున్నాను.
      ఇరవయ్యవ  శతాబ్దపు ప్రధమార్ధములోని "సిమ్హ త్రయము" లోని వారు పానుగంటి.చిలకమర్తి లక్ష్మీ నరసిం హం ,కూచి నరసిం హం, పానుగంటి లక్ష్మీ నరసిం హం  ముగ్గురినీ ఆరోజులలో సిం హత్రయమనే వారు.పానుగంటి 1865 నవంబరు 2న రాజమండ్రి తాలూకా సీతానగరం లో జన్మించారు. తాల్లి రత్నమాంబ, తండ్రి వెంకట రమణ.రాజమండ్రిలో విధ్యాభ్యాసం చేసినారు.కొంతకాలం పెధ్ధాపురం  హైస్కూలు లో పనిచేసి  ,తరువాత పిఠాపురం రాజా వారి ఆస్థానం లో కవిగా వున్నారు.కవి, విమర్సకులు, భావుకులు,సంఘ సంస్కరణ తోపటు రచనా సంస్కరణ కుడా కోరిన వారు.
   వీరి రచనలు -సాక్షి వ్యాసాలు,విప్ర నారాయణ చరిత్ర, పాదుకాపట్టాభిషేకం, సారంగధర, కల్యణ రాఘవం, విజయరాఘవం ,మాలతీమాల,విచిత్ర వివాహం మొ//నవి.ఇందులో సాక్షి వ్యాసాలు వచన రచనలో పేరెన్నిక గన్నవి.ఆనాటి సమాజం పై వచ్చిన వ్యంగ్య రచన.నేటికీ పానుగంటి అనగానే గుర్తుకు వచ్చేవి సాక్షి వ్యాసాలే.
                   ప్రస్తుతం  కంఠాభరణం గురించి కదా చెప్పాల్సింది.ఇది  నాటకం. ఆ నాటి సమాజానికి దర్పణం.కధ విషయానికి వస్తే  సోమావధాన్లు కర్మఠుడగు ఛాందస బ్రాహ్మణుడు. ఆయన భార్య బంగారమ్మ, ఆయన చేత బలవంతాన విధవగా చేయబడిన సుబ్బు లక్ష్మి ముగ్గురు పొరుగూరిలో నున్న వెంకట శాస్త్రి ఇంటికి  వస్తారు.ఆ గ్రామం లో సర్కసు ప్రదర్సిస్తున్నారని  తెలిసి దానిని చూడటానికి కుతూహల పడతారు బంగారమ్మ సుబ్బు లక్ష్మి.సోమావధాన్లుకు తెలియకుండా బయలు దేరుతారు. దారిలో పిచ్చివాడైన రామశాస్త్రులు ఎదురుపడటంతో ఇధ్ధరు చెరొకదారి పారిపోతారు.కృష్ణా రావు ఒక మాధ్వుడు వివాహమై పన్నెండు సంవత్సరాలు గడిచినా భార్య మొహం చూడడు .వేశ్యాలోలుడై తిరుగుతుంటాదు.ప్రస్తుతం సుందరి అనే వేశ్య వలలో వుంటాడు.ఆ వూరిలోని సుబ్బి సెట్టి  అనే షావుకారి షష్ఠి పూర్తికి  సుందరి మేజువాణి పెట్టిస్తాడు కృష్ణమూర్తి .ఆరాత్రికి తనను
 కలవ వలసిందిగా షావుకారు సుందరిని కోరుతాడు. కృష్ణారవు  మామ శ్రిని
వాసరావు తన కూతురి కాపురాన్ని సరిదిధ్ధాలని  షావుకారి ఇంటికి వెళుతున్న  సుందరిని తురక వేషములో అపహరిస్తాడు. సుందరిని షావుకారే మాయం చేసాడనుకొని ఆమె వునికి చెప్పేదాకా కంఠాభరణాన్ని వుంచుకుంటానని  షావుకారి దగ్గర కంఠాభరణాన్ని తీసుకుంటాడు కృష్ణ మూర్తి.షావుకారు నవాబుకి ఫిర్యాదు చేస్తాడు. వెంకటశాస్త్రి ఇద్దరు ఆడవాళ్ళు తప్పిపోయారని నవాబుకి ఫిర్యాదు చేస్తాడు.గ్రామం లో తిరుగు తున్న పిచ్చి వాడిని అదుపులోకి తీసుకోమనడం తో సోమావధానులే పిచ్చి
 వాడనుకొని ఆయన్ని  నవాబు ముందు హాజరు పరుస్తారు.కృష్ణారావు తన భార్యను కూడా వేశ్య అనుకొని ఆమెతో మాట్లాడు తుండగా వారిధ్ధరిని నవాబు సమక్షానికి తీసుకు వస్తారు భటులు.చివరకు  అందరినీ నవాబు ఎదుట హాజరు పరచగా సోమావధానులు బంగారమ్మను,పిచ్చివాడైన రామశాస్త్రులు సుబ్బు లక్ష్మి భర్తగా గుర్తించి వారిని కలుపుతారు.కృష్ణారావు తన భార్య రుక్మిణిని కలుసుకుంటాడు.సుందరిని నవాబు జమానాకి తరలిస్తారు.కంఠాభరణం ను కృష్ణ మూర్తి తీసుకోవడం వల్లనే సుబ్బిసెట్టి నవాబుకి ఫిర్యాదు చేయడం అందరూ అక్కడ సమావేశం అవడం కధ సుఖాంతం అవడ జరిగింది.అందుకే ఆ పేరు పెట్టి వుండవచ్చు.
              ఇక్కడ సోమావధాన్లు పాత్ర చెప్పు కోవలసింది.కరడు కట్టిన చాందసవాది. "మామిడి తోరణం కట్టుకోవడానికి ఎవ్వరైన ఇల్లు ఇచ్చెదరు కాని దర్భశయ్యకెవరైన ఇచ్చెదరా " అంటాడు.అది నిజమేననిపిస్తుంది. అద్దెకున్న ఇంటిలో చనిపోతే శవాన్ని ఇంటివద్ద వుంచడానికి ఇష్టపడని ఇంటి యజమానుల్ని ఇప్పటికీఈమనం చూస్తుంటాము.ఆయన విధవలైన స్త్రీలను పరామర్సించడానికి తన ఇంటిలోని  స్త్రీలందరికీ ప్రత్యేకంగా పరామర్సపు గదులు కట్టించడం,సుబ్బులక్ష్మి భర్త చదువుకోవడానికి నవద్వీపానికి వెళీతే 12 సంవత్సరాలు గడిచిననూ రాలేదని ఆమెకు బలవంతముగా శిరోముండనం చేయించిన ఛాందసవాది. స్త్రీల బుధ్ధులు మరీ చపలములు అంటాడు. భార్య పరాధీన అయితే ఆమెకు ఘట శ్రాధ్ధములు పెట్టుటకు వీలుగా ముందుగానే గది నిర్మించినవాడు. ఒక పదానికి మరొకటి పలకడం కొంత హాస్యాన్ని కలగ చేస్తుంది .
             సుబ్బిశెట్టి  పాత్ర నాటకానికి కీలకం అని చెప్పవచ్చు. వ్యాపార సూత్రాలెన్నోచెబుతాడు.పెధ్ధ ఖాతాలకోసం చూడకుండా దుకాణం లోకి వచ్చిన బేరం చెడగొట్టుకోవధ్ధు అంటాడు. మంచి చెడులు ఎప్పుడు మనసులో వుంటాయి గాని వస్తుచయములో లేవు వంటి సూక్తులు సార్వజనీనకమైనవి.
          ప్రతి ఒక్కరు చదవదగ్గ నాటకంగా చెప్పవచ్చు.