Wednesday, May 15, 2013

 కంఠాభరణం -ఒక సమీక్ష
 ఈ మధ్య పుస్తకాలు సర్ధుతుంటే పానుగంటి లక్ష్మీ నరసిం హా రావు గారి "కంఠాభరణం" కంటబడినది.మళ్ళా ఒకసారి తిరగ  వేద్దాములే అని చదివాను.బ్లాగు మిత్రులకు కూడా పరిచయం చేద్దామని వ్రాస్తున్నాను.
      ఇరవయ్యవ  శతాబ్దపు ప్రధమార్ధములోని "సిమ్హ త్రయము" లోని వారు పానుగంటి.చిలకమర్తి లక్ష్మీ నరసిం హం ,కూచి నరసిం హం, పానుగంటి లక్ష్మీ నరసిం హం  ముగ్గురినీ ఆరోజులలో సిం హత్రయమనే వారు.పానుగంటి 1865 నవంబరు 2న రాజమండ్రి తాలూకా సీతానగరం లో జన్మించారు. తాల్లి రత్నమాంబ, తండ్రి వెంకట రమణ.రాజమండ్రిలో విధ్యాభ్యాసం చేసినారు.కొంతకాలం పెధ్ధాపురం  హైస్కూలు లో పనిచేసి  ,తరువాత పిఠాపురం రాజా వారి ఆస్థానం లో కవిగా వున్నారు.కవి, విమర్సకులు, భావుకులు,సంఘ సంస్కరణ తోపటు రచనా సంస్కరణ కుడా కోరిన వారు.
   వీరి రచనలు -సాక్షి వ్యాసాలు,విప్ర నారాయణ చరిత్ర, పాదుకాపట్టాభిషేకం, సారంగధర, కల్యణ రాఘవం, విజయరాఘవం ,మాలతీమాల,విచిత్ర వివాహం మొ//నవి.ఇందులో సాక్షి వ్యాసాలు వచన రచనలో పేరెన్నిక గన్నవి.ఆనాటి సమాజం పై వచ్చిన వ్యంగ్య రచన.నేటికీ పానుగంటి అనగానే గుర్తుకు వచ్చేవి సాక్షి వ్యాసాలే.
                   ప్రస్తుతం  కంఠాభరణం గురించి కదా చెప్పాల్సింది.ఇది  నాటకం. ఆ నాటి సమాజానికి దర్పణం.కధ విషయానికి వస్తే  సోమావధాన్లు కర్మఠుడగు ఛాందస బ్రాహ్మణుడు. ఆయన భార్య బంగారమ్మ, ఆయన చేత బలవంతాన విధవగా చేయబడిన సుబ్బు లక్ష్మి ముగ్గురు పొరుగూరిలో నున్న వెంకట శాస్త్రి ఇంటికి  వస్తారు.ఆ గ్రామం లో సర్కసు ప్రదర్సిస్తున్నారని  తెలిసి దానిని చూడటానికి కుతూహల పడతారు బంగారమ్మ సుబ్బు లక్ష్మి.సోమావధాన్లుకు తెలియకుండా బయలు దేరుతారు. దారిలో పిచ్చివాడైన రామశాస్త్రులు ఎదురుపడటంతో ఇధ్ధరు చెరొకదారి పారిపోతారు.కృష్ణా రావు ఒక మాధ్వుడు వివాహమై పన్నెండు సంవత్సరాలు గడిచినా భార్య మొహం చూడడు .వేశ్యాలోలుడై తిరుగుతుంటాదు.ప్రస్తుతం సుందరి అనే వేశ్య వలలో వుంటాడు.ఆ వూరిలోని సుబ్బి సెట్టి  అనే షావుకారి షష్ఠి పూర్తికి  సుందరి మేజువాణి పెట్టిస్తాడు కృష్ణమూర్తి .ఆరాత్రికి తనను
 కలవ వలసిందిగా షావుకారు సుందరిని కోరుతాడు. కృష్ణారవు  మామ శ్రిని
వాసరావు తన కూతురి కాపురాన్ని సరిదిధ్ధాలని  షావుకారి ఇంటికి వెళుతున్న  సుందరిని తురక వేషములో అపహరిస్తాడు. సుందరిని షావుకారే మాయం చేసాడనుకొని ఆమె వునికి చెప్పేదాకా కంఠాభరణాన్ని వుంచుకుంటానని  షావుకారి దగ్గర కంఠాభరణాన్ని తీసుకుంటాడు కృష్ణ మూర్తి.షావుకారు నవాబుకి ఫిర్యాదు చేస్తాడు. వెంకటశాస్త్రి ఇద్దరు ఆడవాళ్ళు తప్పిపోయారని నవాబుకి ఫిర్యాదు చేస్తాడు.గ్రామం లో తిరుగు తున్న పిచ్చి వాడిని అదుపులోకి తీసుకోమనడం తో సోమావధానులే పిచ్చి
 వాడనుకొని ఆయన్ని  నవాబు ముందు హాజరు పరుస్తారు.కృష్ణారావు తన భార్యను కూడా వేశ్య అనుకొని ఆమెతో మాట్లాడు తుండగా వారిధ్ధరిని నవాబు సమక్షానికి తీసుకు వస్తారు భటులు.చివరకు  అందరినీ నవాబు ఎదుట హాజరు పరచగా సోమావధానులు బంగారమ్మను,పిచ్చివాడైన రామశాస్త్రులు సుబ్బు లక్ష్మి భర్తగా గుర్తించి వారిని కలుపుతారు.కృష్ణారావు తన భార్య రుక్మిణిని కలుసుకుంటాడు.సుందరిని నవాబు జమానాకి తరలిస్తారు.కంఠాభరణం ను కృష్ణ మూర్తి తీసుకోవడం వల్లనే సుబ్బిసెట్టి నవాబుకి ఫిర్యాదు చేయడం అందరూ అక్కడ సమావేశం అవడం కధ సుఖాంతం అవడ జరిగింది.అందుకే ఆ పేరు పెట్టి వుండవచ్చు.
              ఇక్కడ సోమావధాన్లు పాత్ర చెప్పు కోవలసింది.కరడు కట్టిన చాందసవాది. "మామిడి తోరణం కట్టుకోవడానికి ఎవ్వరైన ఇల్లు ఇచ్చెదరు కాని దర్భశయ్యకెవరైన ఇచ్చెదరా " అంటాడు.అది నిజమేననిపిస్తుంది. అద్దెకున్న ఇంటిలో చనిపోతే శవాన్ని ఇంటివద్ద వుంచడానికి ఇష్టపడని ఇంటి యజమానుల్ని ఇప్పటికీఈమనం చూస్తుంటాము.ఆయన విధవలైన స్త్రీలను పరామర్సించడానికి తన ఇంటిలోని  స్త్రీలందరికీ ప్రత్యేకంగా పరామర్సపు గదులు కట్టించడం,సుబ్బులక్ష్మి భర్త చదువుకోవడానికి నవద్వీపానికి వెళీతే 12 సంవత్సరాలు గడిచిననూ రాలేదని ఆమెకు బలవంతముగా శిరోముండనం చేయించిన ఛాందసవాది. స్త్రీల బుధ్ధులు మరీ చపలములు అంటాడు. భార్య పరాధీన అయితే ఆమెకు ఘట శ్రాధ్ధములు పెట్టుటకు వీలుగా ముందుగానే గది నిర్మించినవాడు. ఒక పదానికి మరొకటి పలకడం కొంత హాస్యాన్ని కలగ చేస్తుంది .
             సుబ్బిశెట్టి  పాత్ర నాటకానికి కీలకం అని చెప్పవచ్చు. వ్యాపార సూత్రాలెన్నోచెబుతాడు.పెధ్ధ ఖాతాలకోసం చూడకుండా దుకాణం లోకి వచ్చిన బేరం చెడగొట్టుకోవధ్ధు అంటాడు. మంచి చెడులు ఎప్పుడు మనసులో వుంటాయి గాని వస్తుచయములో లేవు వంటి సూక్తులు సార్వజనీనకమైనవి.
          ప్రతి ఒక్కరు చదవదగ్గ నాటకంగా చెప్పవచ్చు.

No comments:

Post a Comment